News

రామ వన గమన టూరిజం సర్క్యూట్

562views

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ‘రామ వన గమన టూరిజం సర్క్యూట్’ను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో తొమ్మిది స్థలాలను అభివృద్ధి చేస్తోంది. రామ వన గమన టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది అక్టోబరులో మాతా కౌసల్య దేవాలయాన్ని పునరుద్ధరించారు.

దీనిలో రెండో ప్రాజెక్టుగా శివ్రినారాయణ్ దేవాలయాన్ని పునరుద్ధరించి శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ చరిత మానస్ పారాయణం చేయించి, బహుమతులను కూడా ప్రకటించారు.

భూపేష్ బాఘెల్ మాట్లాడుతూ, అయోధ్య తరహాలో శివ్రినారాయణ్ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రామాయణంతో ఛత్తీస్‌గఢ్‌కు గొప్ప అనుబంధం ఉందన్నారు. రామ వన గమన మార్గంలో తొమ్మిది ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. శ్రీరాముడు 14 ఏళ్ళ వనవాసం సమయంలో శివ్రినారాయణ్ వద్ద బస చేసినట్టు తెలుస్తోంది.

రామ వన గమన మార్గం ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయాలనుకున్న తొమ్మిది స్థలాల్లో మాతా కౌసల్య దేవి దేవాలయం, శివ్రినారాయణ్ దేవాలయం పూర్తయ్యాయి. మిగిలినవాటిని కూడా వచ్చే శాసన సభ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ ప్రాజెక్టులో మిగిలిన స్థలాలు : సీతామఢి హర్‌చౌక (కొరియా), రామ్‌గఢ్ (సర్గూజా), టుర్టురియా (బలోడబజార్), రాజిమ్ (గరియాబంద్), శిహవ సప్తరుషి ఆశ్రమం (ధంతరి), జగదల్‌పూర్ (బస్తర్), రామారం (సుక్మా). మాతా కౌసల్య దేవి జనన తేదీని కచ్చితంగా తెలుసుకునేందుకు చరిత్రకారుల సహాయాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి