News

రానున్న కాలంలో కాషాయమే జాతీయ పతాకం కావచ్చు

460views
  • ఆర్‌ఎస్ఎస్‌ కర్ణాటక ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌ భట్‌

బెంగ‌ళూరు: కాంగ్రెస్‌ కుట్ర పూరిత విధానాల వలన భారత పతాకం మారిందని, రానున్న కాలంలో కాషాయ ధ్వజమే జాతీయ పతాకం కావచ్చునని కర్ణాటక ఆర్‌ఎస్ఎస్‌ ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌ భట్‌ తెలిపారు. విశ్వహిందూ పరిషత్‌ మంగళూరులో ఆదివారం చేపట్టిన కొరగజ్జన క్షేత్ర పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొంటూ బ్రిటీషు పతాకం దేశమంతటా ఉండేదని, అంతకంటే ముందు ఆకుపచ్చ పతాకం ఉండేదని పేర్కొన్నారు. మైనారిటీలను సంతృప్తి పరచడం కోసం జాతీయ పథకంను నిర్ణయించారని చెబుతూ, అయినా తాను జాతీయ పతాకంను గౌరవిస్తానని స్పష్టం చేశారు. అదే విధంగా వందేమాతరంను కాదని జనగనమనను జాతీయ గీతంగా నిర్ణయించారని ప్రభాకర్ భట్ గుర్తు చేశారు.

రాజ్యసభ, లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ సాధ్యమైతే పతాకం మార్పు జరగవచ్చని ఆయన చెప్పారు. పతాకాన్ని మార్పు చేసేందుకు సాధ్యం కాలేదని చెప్పలేమని తెలిపారు. ఇదే తరహాలో కొనసాగితే హిందూ సమాజం ఒక్కటి కానుందని స్పష్టం చేశారు.

కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో చూపింది కొంతమాత్రమే…

కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో చూపింది కొంతమాత్రమే అని తెలిపారు.“అందరినీ చంపాలని ఖురాన్, బైబిల్ బోధిస్తున్నాయి. ఈ విషయాలన్నీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో చిత్రీకరించారు” అని భ‌ట్ చెప్పారు.

“ప్రజలు మనుస్మృతి గురించి మాట్లాడుతున్నారు. అందులో ఎవరికైనా తప్పు అనిపిస్తే ఎత్తి చూపాలి. మనకు అలాంటి స్వేచ్ఛ ఉంది. పాత కాలంలో హిజాబ్ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. కితాబ్ వైపు వెళ్దాం. అందరూ ఐక్యంగా చదువుకోవాలి” అని హితవు చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న హిజాబ్ వివాదం ఒక రకమైన జిహాద్ అని ఆయన ఆరోపించారు. కితాబ్ కంటే హిజాబ్‌ను ఎంచుకోవడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. సానియా మీర్జా, రచయిత్రి సారా అబూబకర్ వంటి మహిళలు వ్యతిరేకించినప్పుడు కొంతమంది ముస్లిం అమ్మాయిలు తరగతి గదులలో హిజాబ్ ధరించాలని పట్టుబట్టడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు నిర్ణయానికి నిరసనగా ఇటీవల ముస్లిం వ్యాపారులు దుకాణాలను మూసివేయడం మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య అని మండిప‌డ్డారు. అలాంటి చర్య దేశద్రోహానికి సమానం అని స్పష్టం చేశారు.

6 నుండి 10 తరగతులలో భగవద్గీతను బోధించాలనే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని భట్ ప్రశంసించారు. భగవద్గీత చదివిన వారెవరూ ఇతరులకు చెడుచేయరని ప్రభాకర్ భట్ స్పష్టం చేశారు. దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలకు రామాయణ, మహాభారత గ్రంథాల గురించి నేర్పాలని ఆయన సూచించారు. తద్వారా సమాజానికే మంచిదని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి