
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొమురవెల్లి పురవీధుల్లో మల్లన్న ఊరేగింపు సేవ జరగనుంది. కీసరలో మహాశివరాత్రి వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఏపీలోని శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాతాళగంగలో నీటిమట్టం తగ్గడంతో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు మల్లన్నకు ఎనిమిదో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులుదీరారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు రద్దు చేశారు.
మరో ప్రముఖ క్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతోంది. త్రికోటేశ్వరుడికి తొలిపూజలో తిరునాళ్లు ప్రారంభమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. కృష్ణా జిల్లా పెద్దకల్లెపల్లిలో దుర్గా నాగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రవహించే నది ఒడ్డున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. అనంతపురంలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహించారు.





