
రియాద్: యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం పలు దేశాల్లోని ప్రజలు యోగా పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో తొలిసారిగా యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. బే లా సన్ బీచ్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రవాస భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.
రేపటి వరకు నాలుగు రోజుల పాటు ఈ యోగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దేశంలో యోగాను ప్రోత్సహించేందుకు సౌదీ యోగా కమిటీ తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని తమ దేశంలో నిర్వహిస్తోంది. యోగా ఫెస్టివల్కు తాము ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన లభిస్తోందని నిర్వాహకులు సంతోషం వ్యక్తంచేశారు. గత 20 ఏళ్లుగా సౌదీ అరేబియాలో యోగాకు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు సౌదీ యోగా కమిటీ చీఫ్ నౌఫ్ బింత్ ముహమ్మద్ అల్-మరోయి ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
జిమ్స్లో యోగా శిక్షణకు ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వడంతో చాలా మంది నిపుణులు ఇందులో శిక్షణ కల్పిస్తున్నారు. సౌదీ క్రీడా మంత్రిత్వ శాఖ కూడా తమ దేశంలో యోగాని ప్రోత్సహిస్తుండటం విశేషం. భారత్కు చెందిన యోగా టీచర్ ఇరుమ్ ఖాన్ కూడా ఈ యోగా ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. సౌదీ అరేబియాలో 2008 నుంచి ఆమె యోగాసనాలపై శిక్షణ కల్పిస్తున్నారు. జెడ్డాకు చెందిన ప్రముఖ యోగా నిపుణులు దనా అల్గోసైబి, లెబనాన్కు చెందిన నటాలీ క్రీడెహ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.