
భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ వైట్హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని దీపం వెలిగించారు. భారత ప్రజలకు, ప్రవాస భారతీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. దీపావళి పండుగ గొప్పతనం గురించి వివరించారు.
‘భారత ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు నేను మీ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడాను. మా మధ్య వాణిజ్య సంబంధాలపై గొప్ప సంభాషణ జరిగింది. పాకిస్థాన్తో యుద్ధం వద్దనే అంశం కూడా మా మధ్య చర్చకు వచ్చింది. వాణిజ్యంతో పాటు యుద్ధం లేకుండా చూడటం చాలా మంచి విషయం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీ తనకు గొప్ప మిత్రుడని, ఆయన గొప్ప వ్యక్తి అని మరోసారి ట్రంప్ ప్రశంసించారు.
ఈ సందర్భంగా దీపావళి పండుగ ప్రాముఖ్యతను ట్రంప్ వివరించారు. ‘చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం దీపాలను వెలిగిస్తాం. శత్రువులను ఓడించి, అడ్డంకులను తొలగించి, బందీలకు విముక్తి కల్పించిన పురాతన గాథలను ఈ పండుగ గుర్తు చేస్తుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సంతతికి చెందిన ముఖ్య నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.




