భారత్ కు రష్యా ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సరఫరాపై అమెరికా ఆగ్రహం…. దీటుగా సమాధానమిచ్చిన భారత్

భారత్ కు క్షిపణి రక్షణ వ్యవస్థను విక్రయించిన రష్యాపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఆ ప్రాంతంలోనూ, వెలుపలా అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఇది తేటతెల్లం చేస్తోందని విమర్శించింది. ఐదు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు 2018లో భారత్, రష్యాల మధ్య 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ ముందడుగు వేసింది.
“ఎస్-400 వ్యవస్థ విషయంలో మాకున్న ఆందోళనల్లో ఏ మాత్రం మార్పు లేదు” అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తాజాగా పేర్కొన్నారు. రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేయరాదని అన్ని దేశాలనూ కోరుతున్నామన్నారు. అయితే ఎస్-400 విషయంలో వెనక్కి తగ్గని భారత్ పై ‘క్యాట్సా’ చట్టం కింద ఆంక్షలు విధించడంపై అమెరికా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తాము ఒక నిర్ణయానికి రాలేదని నెడ్ చెప్పారు. భారత్ తో చర్చలు కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మాది స్వతంత్ర విదేశాంగ విధానం… అమెరికాకు స్పష్టం చేసిన భారత్
ఎస్-400 ఆయుధ వ్యవస్థ కొనుగోలుపై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. తమది స్వతంత్ర విదేశీ విధానమని స్పష్టం చేశారు. తాము చేపట్టే ఆయుధ కొనుగోళ్లకూ ఇది వర్తిస్తుందన్నారు. ఈ విషయంలో జాతీయ భద్రతా ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. భారత్కు అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. అదే సమయంలో రష్యాతో ప్రత్యేక బంధం కొనసాగుతోందన్నారు.





