
-
ట్రంప్ తెచ్చిన విధానాన్ని కొట్టివేసిన కోర్టు
-
భారతీయ ఐటి ఉద్యోగులకు పెద్ద ఊరట
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల జారీలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టు ఆదేశించినట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది. దీంతో వేల భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కలగనుంది. టెక్నాలజీ కంపెనీలు హెచ్-1బీ వీసాల ఆధారంగానే ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తుంటాయి.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనం ఆధారంగా హెచ్-1వీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే, జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను 2021 డిసెంబరు 31 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనపై అమెరికాకు చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన కాలిఫోర్నియా కోర్టు వేతనం ఆధారంగా వర్క్ వీసాల జారీ విధానాన్ని కొట్టేసింది. దీంతో లాటరీ విధానమే కొనసాగనుంది.





