
-
తమిళనాడు ఆరోగ్య శాఖ ఆగ్రహం
చెన్నై: మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్హాసన్పై తమిళనాడు ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా బారినుంచి కోలుకున్నప్పటికీ.. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఆస్పత్రి నుంచి నేరుగా బిగ్బాస్ షూటింగ్ హౌస్కు వెళ్ళడంపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్ వెల్లడించారు.
ఇటీవల అమెరికా వెళ్ళి వచ్చిన కమల్కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆయన నవంబరు 22న నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఈనెల నాలుగోతేదీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అక్కడి నుంచి నేరుగా బిగ్బాస్ షూటింగ్కు వెళ్ళారు. ఇది కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకం. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఒక వారం రోజులపాటు హోం ఐసోలేషన్లో ఉండాలన్న నిబంధన ఉంది. దీనిని పాటించకుండా కమల్ హాసన్ షూటింగ్కు వెళ్ళారు.





