
-
ప్రధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సాంకేతికతను ఉపయోగించుకుని పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలిలోని 77 మంది మంత్రులను ఎనిమిది గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి గ్రూప్లోనూ కొంతమంది నైపుణ్యం కలిగిన యువకులను, రిటైర్డ్ అధికారులను నియమించనున్నారు. వీరి నుంచి సలహాలను తీసుకొని మెరుగైన విధానాలను రూపొందించి అమలు చేయనున్నారు. మంత్రుల కార్యాలయాల్లో మరింత పారదర్శకతను పెంపొందిచే దిశగా ఈ నిపుణుల బృందం ఇంకా ఎక్కువ మందిని నియమించకుకోనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మంత్రి మండలిని మొత్తం ఎనిమిది గ్రూపులుగా విభజించే కసరత్తు అంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ‘చింతన్ శివిర్’ పేరుతో నిర్వహించారు. వీటిలో వ్యక్తిగత సామర్థ్యం, సమర్థవంతమైన అమలు, మంత్రిత్వ శాఖ పనితీరు, పార్టీ సమన్వయం, నైపుణ్యాలు పెంపొందించే విధానాలు, అనుసరించాల్సిన పార్లమెంటరీ పద్ధతులపై చర్చించారు. ఈ సమావేశాలకు పార్లమెంట్ ఉభయ సభాధిపతులు హాజరయ్యారు.





