
-
కల్నల్ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం!
ఇంఫాల్: మణిపూర్లో ఘోరం జరిగిపోయింది. మానవ రూపంలో ఉన్న రాక్షసులు హత్యలకు తెగబడ్డారు. చురాచంద్పూర్ జిల్లాలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. 46 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై శనివారం ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ మేరకు అధికారిక వర్గాలు ఘటనను ధ్రువీకరించాయి. ఈ దాడిలో యూనిట్ కమాండర్తో సహా అతని కుటుంబసభ్యులు ఐదుగురు మరణించినట్టు భావిస్తున్నారు.
బెహియాంగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సియాల్సీ గ్రామ సమీపంలో ఈస్ట్మోజోలో అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని సమాచారం. అధికారిక నివేదికల ప్రకారం, 46 అస్సాం రైఫిల్స్ కమాండిరగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి నిన్న శుక్రవారం తన బెహియాంగ్ కోయ్ పోస్ట్ను సందర్శించి, రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. బెహియాంగ్ పోలీస్ స్టేషన్కు నాలుగు కిలోమీటర్ల దూరంలోని బెహియాంగ్ సమీపంలో శనివారం ఉదయం 10 గంటలకు ఆకస్మిక దాడి జరిగింది. ఈ మేరకు మణిపూర్ పోలీసులు తెలిపారు. ‘కల్నల్ త్రిపాఠి బెహియాంగ్ నుండి తిరిగి వస్తుండగా, అతని వాహనం, ఎస్కార్ట్ వాహనంపై గుర్తు తెలియని అండర్గ్రౌండ్ మిలిటెంట్ గ్రూప్ మెరుపుదాడి చేసింది’ అని మణిపూర్ పోలీసు ప్రతినిధి తెలిపారు.
ఆకస్మిక దాడిలో కల్నల్ త్రిపాఠి, అతని భార్య, వారి కుమారుడు, మరో ఇద్దరు జవాన్లు మరణించారని భద్రతా వర్గాలు తెలిపాయి. మరో ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని బెహియాంగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ‘ఏఆర్ బృందాలు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కూంబింగ్ చేస్తున్నాయి. ఓసీ బహియాంగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తరలిస్తున్నారు’ అని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా, నిషేధిత మణిపురి తీవ్రవాద సంస్థ పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ) ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Source: Tv9





