
-
ఐదేళ్ల జైలు శిక్ష… నాంపల్లి కోర్టు తీర్పు
భాగ్యనగరం: హైదరాబాద్ చాదర్ఘాట్కు చెందిన ఓ యువతి దేశవిదేశాల్లో జరిగే కచేరీల్లో పాటలు పాడుతుంది. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల క్రితం ఆమెకు మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ దుబాయ్లో పరిచయమయ్యాడు. దిల్లీలో ఉంటున్న ముస్లింనంటూ ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత హైదరాబాద్కు వచ్చాక వారికి ఓ బిడ్డ జన్మించింది. తను పాకిస్తాన్వాసినని.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇక్రమ్తో భయంభయంగా జీవిస్తున్న యువతి ఇంట్లోని చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో మూడేళ్ళ కిందట సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అబ్బాస్ ఇక్రమ్ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. హైదరాబాద్లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఇక్కడే నకిలీ ధ్రువపత్రాలు, విద్యార్హతలు, పాస్పోర్ట్, ఆధార్ సంపాదించుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
మహ్మద్ అబ్బాస్ కేసు విచారణను లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు చేయగా పాకిస్తాన్వాసిగా ఉన్న పాస్పోర్టు లభించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వివరాలను పంపగా అబ్బాస్ పాక్ పౌరుడిగా తేలింది. ఆ ఆధారాలను పోలీసులు కోర్టులో సమర్పించగా గతేడాది అక్టోబర్లో నాంపల్లి న్యాయస్థానం విచారణ చేపట్టి ఏడాదిలోపే తుది తీర్పునిచ్చింది. హైదరాబాద్లో తొమ్మిదేళ్లుగా అక్రమంగా నివాసముంటున్నందుకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అబ్బాస్ ఇక్రమ్ ఇప్పటికే మూడున్నరేళ్లు జైల్లో ఉన్నందున మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాత ఇక్రమ్ను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా పాకిస్తాన్కు పంపనున్నారు.