News

మోదీ లక్ష్యంగా జరిగిన పేలుళ్ల కేసులో ఆ తొమ్మిది మందీ దోషులే…

644views

న్యూఢిల్లీ: బీహార్‌ రాజధాని పాట్నాలో నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్‌ 27న జరిపిన పేలుళ్ల ఘటన కేసు విషయంలో కీలక తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు వెల్ల‌డించింది. తొమ్మిది మందిని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. 2013 నవంబర్‌ 6 నుంచి కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. మొత్తంగా 250 మంది సాక్షులను విచారించింది. అప్పట్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘హూంకార్‌’ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

బీజేపీ ప్రధాన నేతలు రావడానికి ముందు వేదిక వద్ద దుండగులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 80 మంది గాయపడ్డారు. స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌ మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి), ఇండియన్‌ ముజాహిదిన్‌కు చెందిన 10 మందిపై ఎన్‌ఐఏ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. సరైన ఆధారాలు లేవన్న కారణంగా ఫక్రుద్దీన్‌ అనే నిందితుడిని కోర్టు విడుదల చేసింది.

నుమాన్‌ అన్సారీ, హైదర్‌ అలీ అలియాస్‌ బ్లాక్‌ బ్యూటీ, మహ్మద్‌ ముజీబుల్లా అన్సారీ, ఒమర్‌ సిద్ధిఖీ, అజారుద్దీన్‌ ఖురేషీ, అహ్మద్‌ హుస్సేన్‌, మహ్మద్‌ ఇఫ్తికార్‌ ఆలం, మహ్మద్‌ ఫిరోజ్‌ అస్లాం, మరో మైనర్‌ను దోషులుగా తేల్చింది. తారిఖ్‌ అన్సారీ అనే మరో నిందితుడు పాట్నా జంక్షన్‌లోని టాయిలెట్‌లో బాంబు పెడుతుండగా అది పేలి చనిపోయాడు. నిందితులకు వచ్చే నెల ఒకటిన కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. హూంకార్‌ ర్యాలీలో మొత్తం 17 ఐఈడీలను అమర్చగా అందులో ఏడింటిని పేల్చారు. దోషులు ప్రస్తుతం పాట్నాలోని బ్యూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి