
-
క్వాడ్ కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు
జెరూసలేం: పశ్చిమాసియాలో భారత ప్రాభవాన్ని ద్విగుణీకృతం చేసేలా నూతన చతుర్భుజ కూటమి అవతరిస్తోంది. ఆ మేరకు కీలక పరిణామాల సమాహారంగా భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్.జైశంకర్ ఇజ్రాయెల్ పర్యటన ఫలవంతమవుతోంది. ఇజ్రాయేలీ మంత్రి యూయిర్ లాపిడ్తో కలిసి అమెరికా, యూఏఈ మంత్రులు ఆంటొనీ బ్లింకెన్, అబ్దుల్లా బిన్ జాయేద్లతో వర్చువల్గా సమావేశమైన జైశంకర్- ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ రాజకీయాల్లో పరస్పర సహకారంపై చర్చలు సాగించారు.
వాతావరణ మార్పులు, ఇంధన సహకారం, సముద్ర భద్రతలపై దృష్టిసారించిన ఆ నలుగురు- ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ దిశగా సమష్టి కృషికి పిలుపిచ్చారు. అంతకు మునుపు యూయిర్ లాపిడ్తో జైశంకర్ భేటీలో ప్రధానాంశాలెన్నో చర్చకు వచ్చాయి. పదేళ్లుగా సంప్రదింపుల దశలోనే మగ్గిపోతున్న స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని 2022 జూన్కల్లా కొలిక్కి తీసుకురావాలన్న ఏకాభిప్రాయం వ్యక్తమైంది.





