
-
రంగంలోకి కేంద్ర భద్రతా దళాలు
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో పౌరులపై మరిన్ని దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ తాజాగా హెచ్చరించింది. కశ్మీర్ లోయలో పౌరులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు కేంద్ర భద్రతా దళాలను రంగంలోకి దించారు. లోయలో వీధి వ్యాపారిని కాల్చి చంపిన వీడియోను ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పేలుళ్లకు ప్రణాళిక రూపొందించిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇటీవల పట్టుకున్నాయి. దీంతో తాము పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు చేస్తున్నామని ఐఎస్ కే తెలిపింది.
ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ఉగ్రవాద సంస్థ స్లీపర్ సెల్ కశ్మీర్ లోయ అంతటా విస్తరించి ఉందని కేంద్ర భద్రతా సంస్థలు హెచ్చరించాయి. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జమ్మూ అండ్ కశ్మీరులో దాడులకు ప్లాన్ చేయడానికి పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలతో ఇటీవల రహస్య సమావేశం నిర్వహించింది. ఇటీవల జరిగిన ఉగ్ర దాడుల వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని కూడా భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న పలువురిపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కఠినంగా వ్యవహరించింది. ఎన్ఐఏ అక్టోబరు 10వతేదీన 16 ప్రాంతాల్లో దాడులు చేసింది.





