
బీజింగ్: కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చేందుకు చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. చైనాకు చెందిన ఎవర్గ్రాండే దివాలా అంచుకు చేరింది.
ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల మేరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్(పెట్టుబడి గ్రేడ్లో లేని సంస్థల బాండ్లు) ఈల్డ్ ఒక్కసారిగా 14.4శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎవర్గ్రాండే సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల పరంగా.. దేశవిదేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు చాలా భారీగా ఉన్నాయి.
ఈ సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించలేనని ఇటీవల ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా దీని ఇన్వెస్టర్లు షాక్కు గురయ్యారు. చైనా ప్రభుత్వం కూడా దీనిని ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయటానికి ఎటువంటి ప్రణాళికలను ప్రకటించలేదు.





