
* ప్రభుత్వం ఇతర మతాల కోసం కోట్లాది రూపాయల డబ్బును వ్యయం చేస్తున్నప్పుడు మీరెందుకు నోరు విప్పలేదు?
* హిందూ పండుగలప్పుడు మాత్రమే మీకు హఠాత్తుగా ప్రజా ప్రయోజనాలు గుర్తుకొస్తాయా?
* రావణదహనం, వినాయక చవితి అయిపాయాయి. ఇక మీ తదుపరి లక్ష్యం దేవీ నవరాత్రులను ఆపటమేనా? – పిటిషనర్ కు కోర్టు సూటి ప్రశ్న
చవకబారు ప్రచారం కోసం, హిందూ పండుగల శోభకి విఘాతం కలిగించాలనే దురుద్దేశ్యంతోనూ హిందూ పండుగలకు వ్యతిరేకంగా పదే పదే కోర్టులో పిటిషన్లు వేస్తున్న ఓ సామాజిక కార్యకర్తపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దురుద్దేశంతో కూడిన ఇలాంటి పిటిషన్ల వల్ల మత సామరస్యానికి విఘాతం ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.
పిటిషనర్ జనార్ధన్ మూన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ భూషణ్ గవాయి, జస్టిస్ వినయ్ దేశపాండేల ద్విసభ్య బెంచ్…. ప్రభుత్వం దీక్షా భూమి, తాజా బాగ్ ల ఆధునీకరణ కోసం, డ్రాగన్ ప్యాలెస్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని పిటిషనర్ ని ప్రశ్నించింది. కేవలం హిందూ పండుగలప్పుడే మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న సంగతి అకస్మాత్తుగా గుర్తొస్తుందా? అని పిటిషనర్ ని సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ తన పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలిసిందిగా కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ కు కోర్టు భారీ జరిమానాను కూడా విధించడం గమనార్హం.
జనార్ధన్ మూన్ సారథ్యం వహిస్తున్న ‘నాగిరి హక్కా సంరక్షణ మంచ్’ గతంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిషేదించవలసిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేయడం గమనార్హం. ఆనాడు కోర్టు పిటిషనర్ కు 25 వేల రూపాయల భారీ జరిమానాను కూడా కోర్టు విధించింది.
వినాయక చవితి గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలలో దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షని, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించిన లోకమాన్య తిలక్ గౌరవార్ధం….. అత్యున్నతంగా అలంకరించబడిన గణేష్ మండపాలకు, పర్యావరణ హితకరంగా ఉన్న గణేష్ మండపాలకు, భేటీ బచావో బేటి పడావో, అక్షరాస్యత, నీటి పొదుపు తదితర అంశాలపై ప్రేరణ కలిగించేలా ఉన్న గణేష్ మండపాలకు ప్రభుత్వం బహుమతులు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పిటిషనర్ కోర్టులో సవాలు చేశారు. పిటిషనర్ పదే పదే హిందూ పండుగలనే లక్ష్యంగా చేసుకుని కోర్టులను ఆశ్రయించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
పిటిషనర్ రాజ్యాంగాన్ని చదివి సెక్యులరిజం పదానికి ఉన్న అసలైన అర్థాన్ని తెలుసుకోవాలని కూడా కోర్టు సూచించింది. రావణ దహనం అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది ఇక మీ తర్వాతి లక్ష్యం ఏమిటి? నవరాత్రి ఉత్సవాలను ఆపడమేనా? అని కోర్టు పిటిషనర్ ని తీవ్రంగా ప్రశ్నించింది. కేవలం చౌకబారు ప్రచారం కోసమే పిటిషనర్ పదేపదే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లుగా కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పేరు అశ్విన్ ఇంగొలే.





