ప్రపంచ జావలిన్ త్రో ర్యాంకింగ్ లో నీరజ్ చోప్రా కు రెండో స్థానం.. జాబితాలో భారత్ నుంచి మరి కొందరికి చోటు..

టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్ అవ్వడం విశేషం. వేసవి క్రీడలకు ముందు భారత అథ్లెట్ ప్రపంచ ర్యాకింగ్స్లో 16వ స్థానంలో ఉన్నాడు. టోక్యో 2020లో భారతదేశం తరపున ట్రాక్ అండ్ ఫీల్డ్లో తొలిసారి ఒలింపిక్ పతకాన్ని అందించాడు. దీంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించి పలు రికార్డులను నెలకొల్పాడు. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత దేశానికి వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించి విజేతగా నిలిచాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్లో జర్మనీకి చెందిన అథ్లెట్ జోహన్నెస్ వెట్టర్ తొలిస్థానంలో నిలిచాడు. భారత ప్లేయర్లు రోహిత్ యాదవ్ (ప్రపంచ నం. 56), యశ్వీర్ సింగ్ (ప్రపంచ నం. 63), డీపీ మను (ప్రపంచ నం. 84) టాప్ 100లో చోటు దక్కించుకున్నారు. జావెలిన్లో మహిళల జాతీయ రికార్డు హోల్డర్ అన్నూ రాణి ప్రస్తుతం ప్రపంచ నంబర్ 16వ స్థానంలో ఉంది.





