
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో వణికిపోయిన భారత్లో పరిస్థితులు ఈమధ్యే కుదుటపడుతున్నట్లు కనిపించాయి. ఇదే సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంపై వైద్యనిపుణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ‘ఆర్ ఫ్యాక్టర్ (రీ-ప్రొడక్షన్ రేటు)’ పెరగడం పట్ల కేంద్ర హోంశాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి నిబంధనలు అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు.
* దేశంలో చాలా ప్రాంతాల్లో మాస్కులు, భౌతికదూరం వంటి కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛంగా కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా, పర్వత ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.
* మరికొన్ని రాష్ట్రాల్లో ‘ఆర్-ఫ్యాక్టర్’ ఆందోళన కలిగిస్తోంది. ఇది 1.0 కంటే ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కుగా ఉన్నట్లే. నాలుగు వారాల క్రితం 0.74శాతంగా ఉన్న ఆర్-ఫ్యాక్టర్, ప్రస్తుతం 0.95కు చేరుకోవడం ఆందోళనకరం.
* షాపింగ్ మాల్స్, మార్కెట్లు, రెస్టారెంట్లు, బస్సు, రైల్వే స్టేషన్లు, వివాహ వేదికలు, స్టేడియాల వంటి రద్దీ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో విఫలమైన అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులుగా చేయాలి.
* కొవిడ్ సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. అలసత్వానికి చోటు ఇవ్వకూడదు.
* మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఐదంచెల వ్యూహాన్ని తప్పక పాటించాలి. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ విధానాన్ని తప్పకుండా అనుసరించాలి.
ఇదిలాఉంటే, కరోనా తీవ్రతపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి పలు సూచనలు చేశారు. అనంతరం కేంద్ర హోంశాఖ నుంచి ఈ విధమైన సూచనలు రావడం గమనార్హం.





