
జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ ఈ ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఇప్పటికే అక్కడ పర్యటించిన ప్యానల్ కమిటీ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించి, ఓ నిర్దిష్ట నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో జమ్ముకశ్మీర్ను కేంద్రం రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్ము, లద్దాఖ్ ప్రాంతాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. ఇటీవల జమ్ముకశ్మీర్లోని అఖిలపక్ష నేతలతో చర్చించిన ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్కు తిరిగి పాత హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీల నేతల్ని కోరారు.
ఇందులో భాగంగా ఎన్నికల కంటే ముందుగానే జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతోంది కేంద్రం. ఫార్మర్ సుప్రీంకోర్ట్ జడ్జ్ రంజన దేశాయ్ నేతృత్వంలో ప్యానల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జమ్ముకశ్మీర్కు వెళ్లి డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించింది. జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల పెంపుపై పలు సిఫార్సుల్ని సైతం తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ 7 నియోజకవర్గాల పెంపు తప్పనిసరి అని కమిటీ స్పష్టం చేసినట్టు సమాచారం.
జమ్ముకశ్మీర్లో మొత్తం 83 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కశ్మీర్ వ్యాలీలో 46 సీట్లు ఉండగా.. జమ్ము రీజియన్లో 37 స్థానాలున్నాయి. ఇదే సంవత్సరం అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్ని పెంచాలని ఎప్పటి నుంచో భావిస్తోంది కేంద్రం. అందుకు తగ్గట్టుగానే వేగంగా అడుగులు వేస్తోంది. జమ్ముకశ్మీర్లో అదనంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం ఉందని స్థానిక నేతలతో పాటు అధికార యంత్రాంగం భావిస్తోంది. డీలిమిటేషన్ ప్యానల్ కమిటీ సైతం అడిషనల్గా 7 నియోజకవర్గాల్ని ఏర్పాటు చేయొచ్చంటూ ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది.





