
గంగానది కరోనారహితమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. నదిలో వైరస్ ఆనవాళ్లు ఎక్కడా లభించలేదని తెలిపారు. గతంలో లఖ్నవూలోని గోమతి నదిలో కరోనా వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని గంగానదిలో కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలు కొట్టుకురావడం, పలు చోట్ల గంగానది ఒడ్డున అనేక మృతదేహాలను పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ నదిలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే, శాస్త్రవేత్తలు గంగానది నీటిపై పరిశోధనలు నిర్వహించి వైరస్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు.
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్, యూపీ స్టేట్ పొల్యూషన్ బోర్డుతో కలిసి జల్శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా సొసైటీ ఈ పరిశోధనలు నిర్వహించింది. రెండు దశల్లో యూపీ, బిహార్లోని కనౌజ్, ఉన్నావ్, కాన్పూర్, హమిర్పుర్, అలహాబాద్, వారాణాసి, బాలియా, ఘాజిపూర్, పట్నా, ఛాప్రా తదితర ప్రాంతాల నుంచి నామూనాలను సేకరించి ఆర్టీ పీసీఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించగా.. ఆ నమూనాల్లో కరోనా వైరస్ కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
మరో పరిశోధనలోనూ అదే ఫలితం..
శాస్త్రవేత్తలు, జన్యు నిపుణులు కూడా రెండు నెలలపాటు గంగానదిలో వైరస్ ఆనవాళ్లపై పరిశోధనలు చేశారు. ”మా బృందం అనేక నమూనాలను సేకరించి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేసింది. వాటిలో పాజిటివ్గా నిర్థరణ అయినవి ఉన్నాయి… నెగటీవ్ వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ, గంగానది నుంచి సేకరించిన నమూనాల్లో మాత్రం వైరల్ ఆర్ఎన్ఏ కనిపించలేదు”అని బీఎస్ఐపీ శాస్త్రవేత్త నీరజ్ రాయ్ వెల్లడించారు.
బీహెచ్యూ ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబె మాట్లాడుతూ… ”మే నెలలో గంగానదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన నేపథ్యంలో నిపుణులు ఆ నదిలో వైరస్ వ్యాప్తి జరిగి ఉండొచ్చని భావించారు. అందుకే బీహెచ్యూ, బీఎస్ఐపీ కలిసి పరిశోధనలు చేశాయి. వారణాసిలోని గంగానదిలో ఏడు వారాలపాటు ప్రతి వారం రెండు నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాం. కానీ, గంగానదిలో వైరస్ ఆనవాళ్లు లేవు”అని తెలిపారు.





