
పాకిస్థాన్ జైళ్లలో 51 మంది భారతీయ పౌరులు, 558 మత్స్యకారులు (భారతీయులుగా భావిస్తున్న వ్యక్తులు) బందీలుగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ(ఎంఈఏ) వెల్లడించింది. తాజాగా భారత్- పాకిస్థాన్ దేశాలు తమ కస్టడీలో ఉన్న బందీలు, మత్స్యకారుల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఎంఈఏ అందజేసిన జాబితా ప్రకారం 271 మంది పాకిస్థాన్ పౌరులు, 74 మంది మత్స్యకారులు భారత్ కస్టడీలో ఉన్నారు. 2008 ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఏటా జనవరి 1వ తేదీ, జులై 1వ తేదీన తమ దేశంలో బందీల జాబితాను వెల్లడించాలి.
పాక్లో బందీలుగా ఉన్న భారత పౌరుల్ని, మత్స్యకారుల్ని విడుదల చేయాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వాన్ని ఎంఈఏ కోరింది. భారతీయులుగా గుర్తించిన ఒక పౌరుడు, 295 మత్స్యకారుల్ని ముందుగా విడుదల చేయాలని పాక్ను కోరినట్లు పేర్కొంది. భారతీయులుగా భావిస్తున్న మరో 197 మంది మత్స్యకారులు, 17 మంది పౌరులను భారత రాయబార అధికారులు కలుసుకునే అవకాశం కల్పించాలని, కస్టడీలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షించేందుకు భారత వైద్య నిపుణులకు వీసాలు మంజూరు చేయాలని పాక్ను అభ్యర్థించింది. కరోనా నేపథ్యంలో బందీలుగా ఉన్న భారతీయుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా పాక్ ప్రభుత్వానికి సూచించినట్లు ఎంఈఏ తెలిపింది.





