
కరోనా మహమ్మారికి తీవ్రంగా ఇబ్బందిపడిన ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. గతంలో కరోనా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే, కాల్చిచంపేలా చట్టం తెస్తామని హెచ్చరించాడు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో. వ్యాక్సిన్ తీసుకోనివారిపై అదే తరహాలో ఘాటుగా స్పందించాడు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ”ఇది నేషనల్ ఎమర్జెన్సీ. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ టీకా పొందాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించి, టీకా వేయించుకోకుంటే వారిని నిర్బంధిస్తాం. ఇప్పటికే మనం కష్టకాలంలో ఉన్నాం. టీకా వేసుకోకుండా ఇంకా ఎక్కువ కష్టాన్ని కొనితెచ్చుకోకండి. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇష్టం లేనివారు దేశం విడిచిపెట్టి భారత్ లేదా అమెరికా.. లేదా ఏదో ఒక దేశానికి వెళ్లిపోండి. అంతేకానీ ఇక్కడ మాత్రం ఉండకండి. ఇక్కడ ఉండాలనుకుంటే మాత్రం వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే” అని ఆగ్రహావేశాలు వెళ్లగక్కాడు.

టీకా వేయించుకోకుంటే..?
దేశం గడ్డు పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని గట్టిగా తెలియజేస్తూ ”వ్యాక్సిన్ తీసుకోనివారే వైరస్ వ్యాప్తికి కారణం. టీకా పొందని వారందరికీ పందులకు వేసే ఇంజక్షన్ ఇస్తాం. ఇదీ మీలోని వైరస్నే కాదు.. మిమ్మల్ని కూడా చంపేస్తుంది” అని హెచ్చరించాడు. కాగా బుధవారం ఒక్కరోజే ఫిలిప్పీన్స్లో 4,353 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 13.75 లక్షలకు పైగా పాజిటివ్ కేసులను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.





