
భారత కోస్ట్ గార్డ్ బృందం సాహసంతో తమ సత్తా చాటారు. గురువారం అరేబియా సముద్రంలో మునిగిపోతున్న ఓ రవాణా ఓడ నుంచి16 సిబ్బందిని రక్షించినట్లు.. రాయగడ్ జిల్లా రేవ్దండా పోర్ట్ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.
మహారాష్ట్రలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడంతో ముంబై తీర ప్రాంతంలో ఓ రవాణా నౌక ముునిగిపోయింది. రేవ్దండా జెట్టీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటనను గుర్తించి ఐసీజీ వెంటనే అప్రమత్తమైంది. ఇద్దరు ఐసిజి ఛాపర్లు ‘ఎయిర్-సీ’ సమన్వయ ఆపరేషన్ నిర్వహించి ఆ నౌకలోని సిబ్బందిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
మునిగిపోతున్న మంగళం అనే నౌక నుంచి సాయం కోరుతూ వచ్చిన సందేశంతో డామన్ నుంచి రెండు చేతక్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అలాగే, మునుగుతున్న ఓడలో చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించేందుకు ముంబైలోని మురుద్ జంజీరా కోట నుంచి సుభద్ర కుమారి చౌహాన్ నౌక బయలుదేరింది. డిఘి నుండి బయలుదేరగా, డామన్లోని ఎయిర్ స్టేషన్ నుండి మరో రెండు ఐసిజి హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. అనంతరం అన్నీ కలిసి సమన్వయం చేసుకుంటూ నౌకలో చిక్కుకున్న మొత్తం 16 మంది సిబ్బందిని రక్షించి రేవండాకు తరలించారు.





