News

పాపం జుహీ చావ్లా : ప్రచారం కోసం ప్రాకులాట : రూ.20లక్షల జరిమానా

553views

టీవల పర్యావరణవేత్తగా అవతారమెత్తిన బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా దేశంలో 5జీ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల జరిమానా విధించింది.

5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి జుహీ, వీరేశ్‌ మాలిక్‌, టీనా వచానీ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీలో ఉండే రేడియేషన్‌ వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని, మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్లు అధిక ప్రభావం పడుతుందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై న్యాయస్థానం ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపగా.. జుహీ అభిమానులు కొందరు ఆన్‌లైన్‌లోకి వచ్చి పలుమార్లు ఆటంకం కలిగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. విచారణను వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం మాత్రమేనని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టిపారేసింది. కోర్టు విచారణ లింక్‌ను జుహీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినట్లుగా అన్పిస్తోందని తెలిపింది. న్యాయప్రక్రియను హేళన చేసినందుకుగాను పిటిషనర్లకు రూ.20లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అంతేగాక, విచారణ సమయంలో ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించిన వారెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఇక 5జీ టెక్నాలజీపై పిటిషనర్లు ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని గత విచారణలో న్యాయస్థానం సూచించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.