
దక్షిణ కశ్మీర్లోని షోపియాన్లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ హతమయ్యాడు. సోమవారం ఉదయం రావల్పొరా ప్రాంతంలో భద్రతాదళాలు అతడిని మట్టుబెట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. జైషే అగ్రనాయకుల్లో ఒకడైన అఫ్గానీ.. ఉగ్రవాద ముఠాలోకి స్థానిక యువత నియామకాలు చేపడుతాడని పోలీసులు తెలిపారు.

ఈ ఎన్కౌంటర్లో అఫ్గానీతో పాటు స్థానిక ఉగ్రవాది జహంగీర్ అహ్మద్ కూడా హతమయ్యాడు. అఫ్గానీ, అతడి అనుచరులు రావల్పొరా గ్రామంలో నక్కినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు పారిపోకుండా భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. అనంతరం కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. శనివారం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారి నుంచి ఒక ఏకే 47 రైఫిల్, అమెరికాలో తయారైన ఎం4 కార్బైన్ రైఫిల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.





