News

గణతంత్ర వేడుకల్లో కనువిందు చేయనున్న రామమందిరం

731views

2021 గణతంత్ర వేడుకల్లో రామమందిరం కనువిందు చేయనుంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్‌లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. అయోధ్యలో త్వరలో నిర్మించబోయే రామమందిరం ఆకృతిని ఈ శకటంపై రూపొందించనున్నారు. దీంతో పాటు దీపోత్సవాన్ని ప్రతిబింబించే నమూనాను కూడా తీర్చిదిద్దనున్నారు. ‘అయోధ్య: కల్చరల్‌ హెరిటేజ్‌ ఉత్తరప్రదేశ్’ పేరుతో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ శకటాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. యూపీ ప్రభుత్వం పంపిన రామమందిర శకట ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లు పేర్కొంది. ‘సర్వ ధర్మ సమాభావ్‌’ థీమ్ తో ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో శకటాలను ప్రదర్శించనున్నారు.

2017లో యూపీలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో ఏటా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సరయూ నదీ తీరాన ‘దీపోత్సవ్‌’ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవంలో భాగంగా ఆరు లక్షలకు పైగా దీపాలను వెలిగించడంతో అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలిగింది. దీనికి గిన్నిస్‌ రికార్డు కూడా లభించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.