
ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారిన పాకిస్థాన్కు భారత్, అమెరికా తీవ్ర హెచ్చరికలు చేశాయి. వెంటనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని పాక్కు తేల్చి చెప్పాయి. ఆ దిశగా వెంటనే సుస్థిర, తిరుగులేని చర్యలు చేపట్టాలని సూచించాయి. 26/11, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డ దోషులను వెంటనే చట్టం ముందుకు తీసుకురావాలని తేల్చి చెప్పాయి. ఈ మేరకు భారత్-అమెరికా మధ్య జరిగిన ‘ఇండియా-యూఎస్ కౌంటర్ టెర్రిరజం జాయింట్ వర్కింగ్ గ్రూప్ వర్చువల్ సమావేశం’ అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించాయి. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగించాలని నిర్ణయించాయి.
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. అల్ఖైదా, ఐసిస్,లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పాయి. వివిధ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులపై ఆంక్షలు విధించే విషయంలో అవలంబిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించాయి.





