News

ఆఫ్రికాలో ఐ ఎస్ పంజా

531views

ఫ్రికాలో కీలకమైన మొజాంబిక్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ మొసిమ్‌బోవాను ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పోర్టు కోసం భీకర పోరాటం సాగుతోందని మొజాంబిక్‌ భద్రతా దళమైన ఎఫ్‌డీఎస్‌ వెల్లడించింది. ఈ పోర్టు మొజాంబిక్‌ ప్రభుత్వం చేతిలో నుంచి ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లడం ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. ఈ పోరులో భారీ సంఖ్యలో సైనికులు చనిపోగా.. మరోపక్క 59 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఒక పెట్రోల్‌ బోటును ముంచేశాయి. అక్కడ ప్రజలను కవచాలుగా పెట్టుకొని ఉగ్రవాదులు పోరాడుతున్నారని సైనికాధికారులు వెల్లడించారు.

ఈ పోర్టుకు దాదాపు 40 మైళ్ల దూరంలో ఉన్న అతిపెద్ద గ్యాస్‌క్షేత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల కాలంలో పోర్టు చుట్టుపక్కల నగరాలను ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థ ఆక్రమిస్తూ వస్తోంది. ఈ పోర్టు కోసం పలు మార్లు దాడులు చేసిన ఐఎస్‌ తాజాగా విజయం సాధించింది. మొజాంబిక్‌ భద్రతా దళాలు తీవ్రమైన ఆయుధ కొరతతో ఉండటాన్ని అదునుగా భావించి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ తరఫున అహ్లు సున్నాహ్‌ వా జమా సంస్థ పనిచేస్తోంది. తాజాగా పోర్ట స్వాధీనంతో ఇప్పుడు గ్యాస్ క్షేత్రంపై ఐఎస్‌ దృష్టిపెట్టవచ్చని భయపడుతున్నారు. గతంలో కూడా సిరియాలో చమురు క్షేత్రాలను స్వాధీనం చేసుకొని ఐసిస్‌ డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.