
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న దృష్ట్యా కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సైన్యానికి తగిన స్వేచ్ఛనిస్తోంది. తాజాగా రూ.300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసుకొనే అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టింది. పరిమితి మేరకు ఇకపై కొనుగోళ్లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలుస్తోంది!
రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశం జరిగింది. ఇకపై అత్యవసర పనుల నిర్వహణ కోసం ఆయుధాలు కొనుగోలు చేసుకొనే ప్రత్యేక అధికారాన్ని సైన్యానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. రూ.300 కోట్ల వరకు ఎన్నైనా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని తెలిపింది. లద్దాఖ్ సహా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై సమీక్షించింది. సైన్యాన్ని మరింత పటిష్ఠంగా మార్చాల్సిన అవసరముందని పేర్కొంది.
‘అత్యవసర పనుల నిమిత్తం ఆయుధాలు కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి డీఏసీ బదిలీ చేసింది. పెట్టుబడి కోసం రూ.300 కోట్లు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆయుధాల దిగుమతి కాలం ఏడాది కంటే తగ్గుతుంది’ అని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. ఎన్ని కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నా ఫర్వాలేదని వాటి విలువ మాత్రం రూ.300 కోట్లలోపే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.





