
పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్థాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మలీర్లోని ఓ మోడల్ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్ ఎయిర్ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ధ్రువీకరించారు. విమాన ప్రమాదం గురించి ఇప్పుడేమీ మాట్లాడలేమన్నారు. విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్లో శిక్షణ పొందినవారేనని చెప్పారు. ప్రమాద ఘటనపై సమాచారం అందించడంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. లాహోర్ నుంచి కరాచీకి వస్తున్న ఏ-320 విమానంలో 99 మంది ప్రయాణికులు, 9మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. జనావాసాల మధ్య ఈ విమానం కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. రంజాన్ వేడుకలకు దేశమంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకుంది.





