News

పాకిస్థాన్‌లో అసలు చిచ్చు ఇదేనా? పంజాబ్‌ ఆధిపత్యంపై పెరుగుతున్న అసంతృప్తి

20views

పాకిస్థాన్‌ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఓ నివేదిక పేర్కొంది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న పంజాబ్‌ ప్రావిన్స్‌ అధికారంపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటని తెలిపింది. సైన్యం, న్యాయవ్యవస్థ, అధికార యంత్రాంగం, భద్రతా సంస్థల్లో పంజాబ్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉందని వివరించింది.

పాకిస్థాన్‌ ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్‌ పంజాబ్‌ దేశ అధికార వ్యవస్థలో కీలకంగా ఉందని ‘ది ఫ్రైడే టైమ్స్‌’లో మూనిస్‌ అహ్మర్‌ రాసిన నివేదిక పేర్కొంది. పంజాబ్‌లోని దక్షిణ సరకీ ప్రాంతానికి మాత్రం సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తెలిపింది. ప్రత్యేక ప్రావిన్స్‌ హోదా కోసం ఆ ప్రాంతం డిమాండ్‌ చేస్తున్నా లాహోర్‌ నుంచి అంగీకారం రావడం లేదని పేర్కొంది.

పాకిస్థాన్‌ సైన్యంలో 65 శాతానికి పైగా అధికారులు, సైనికులు మధ్య, ఉత్తర పంజాబ్‌ ప్రాంతాలకు చెందినవారేనని నివేదిక తెలిపింది. దీంతో సింధ్‌, బలూచిస్థాన్‌, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా వంటి ప్రావిన్సుల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంది. కేంద్ర అధికార యంత్రాంగంలోనూ పంజాబ్‌కు భారీ ప్రాతినిధ్యం ఉందని తెలిపింది.

నీటి పంపిణీ అంశం కూడా ప్రావిన్సుల మధ్య విభేదాలను మరింత పెంచుతోంది. 1991 నీటి పంపిణీ ఒప్పందం ప్రకారం పంజాబ్‌కు అత్యధిక వాటా ఉన్నప్పటికీ.. ఇతర ప్రాంతాల వాటాలను కూడా ఆక్రమిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నీటి పంపిణీలో పారదర్శకత లేకపోవడం, నిబంధనల అమలు బలహీనంగా ఉండటం దీనికి కారణాలుగా పేర్కొంటున్నారు.

సింధ్‌, బలూచిస్థాన్‌, ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతాలు నీటి విషయంలో పంజాబ్‌ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సాగు, తాగునీరు, ఆర్థికాభివృద్ధిపై దీని ప్రభావం పడుతోందని ఆయా ప్రాంతాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సింధ్‌.. సింధు జలాలపై అధికంగా ఆధారపడుతున్నందున నీటి పంపిణీలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తోంది.