
కర్ణాటక: చిక్కబళ్లాపూర్ జిల్లాలోని చొక్కహళ్లి గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అద్దె ఇంట్లో ఆమె ఉరి వేసుకుని కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతురాలిని ఇన్మిన్చెన్హళ్లి గ్రామానికి చెందిన చైత్రగా గుర్తించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చైత్ర గత 7–8 ఏళ్లుగా తన భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కోలార్కు చెందిన షబ్బీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. అనంతరం ఇద్దరూ చొక్కహళ్లిలోని ఓ అద్దె ఇంట్లో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.
చైత్ర ఇంట్లో ఉరి వేసుకుని కనిపించడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే షబ్బీర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చైత్ర మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, షబ్బీర్ పాత్రపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న నందిగిరిధామ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు.
చైత్ర మృతి ఆత్మహత్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.





