News

ఒంటరిగా నదిని శుభ్రం చేయడం ప్రారంభించిన మధ్యప్రదేశ్ యువకుడు

22views

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడి పర్యావరణ సేవకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమైన నదిని ఒంటరిగా శుభ్రం చేసిన అతడి కార్యదక్షతను గుర్తించిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ, తమ బృందంలో చేరాల్సిందిగా ఆహ్వానించింది.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా, బియావ్రాకు చెందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు తబాహి) ఈ ఘనత సాధించాడు. స్థానికంగా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి, ఒక డంపింగ్ యార్డ్‌‌ను తలపించేది. ఇది చూసి చలించిన డిగ్రీ విద్యార్థి బిట్టు, ఆ నదిని ప్రక్షాళన చేయాలని దృఢ నిర్ణయం తీసుకున్నాడు. కనీసం ఈత రాకపోయినా, చేతులకు గ్లౌజులు గానీ, కాళ్లకు బూట్లు గానీ లేకపోయినా నదిలోకి దిగి వ్యర్థాలను తొలగించడం ప్రారంభించాడు.

అతడి సంకల్పాన్ని చూసి స్ఫూర్తి పొందిన కొందరు స్నేహితులు సైతం ఈ సేవలో భాగస్వాములయ్యారు. అందరూ కలిసి కొద్ది నెలల వ్యవధిలోనే ఆ నదిని పూర్తిగా శుభ్రం చేశారు. బిట్టు చేస్తున్న ఈ పనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలో బిట్టు సేవ గురించి తెలుసుకున్న నెదర్లాండ్స్‌కు చెందిన ‘ది ఓషన్ క్లీనప్’ అనే స్వచ్ఛంద సంస్థ సీఈఓ బోయాన్ స్లాట్ సానుకూలంగా స్పందించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల బిట్టుకు ఉన్న అంకితభావాన్ని మెచ్చుకుంటూ, తమ సంస్థలో చేరాల్సిందిగా ఆన్‌లైన్ వేదికగా బహిరంగంగా ఆహ్వానించారు.