News

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సిట్‌ తుది నివేదిక

5views

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ట్రస్ట్‌ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ట్రస్ట్‌ మాజీ సభ్యుడు అనిల్‌ మిశ్రాకు కూడా కేసుతో సంబంధం లేదని తేల్చింది. ఈ కేసుపై దర్యాప్తు పూర్తిచేసిన సిట్‌ తుది నివేదికను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌ హోంశాఖ అందించింది.

విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో చంపత్‌రాయ్‌, అనిల్‌ మిశ్రా జూన్‌ 27న తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం సిట్‌ వారిద్దరినీ విచారించింది. ఆలయానికి వచ్చిన విరాళాల సేకరణ, నగదు నిర్వహణపై వివరాలు సేకరించింది. విచారణలో చంపత్‌రాయ్‌ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. అక్రమాల విషయం తెలిసిన వెంటనే తానే ఫిర్యాదు చేశానని ఆయన దర్యాప్తు అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో లక్నో డివిజనల్‌ కమిషనర్‌ విజయ్‌ విశ్వాస్‌ పంత్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో సిట్‌ ఏర్పాటైంది. రేంజ్‌ ఐజీ కిరణ్‌ ఎస్‌, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్‌రతన్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు. జూన్‌ 23న సిట్‌ ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా జూన్‌ 25న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.