
హిందువులు పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు కాశ్మీరీ ముస్లిం నేతలతోపాటు పౌర సంఘాల నేతలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ యాత్ర విజయవంతం కావాలని వారంతా ఆకాంక్షించారు. తాము ఈ యాత్రికుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు. యాత్ర సజావుగా సాగేందుకు.. యాత్రికులకు సహకారం అందించేందుకు అన్ని విధాల సహకరిస్తామని వారు స్పష్టం చేశారు. శ్రీనగర్లో అమర్నాథ్ యాత్ర పుణ్య క్షేత్ర బోర్డ్ చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కాశ్మీర్ ముస్లిం నేతలతోపాటు పౌర సంఘాల నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో పాల్గొని.. అమర్నాథ్ యాత్రకు మద్దతు ప్రకటించిన వారిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసలు కురిపించారు. వారంతా ఆధ్యాత్మిక సంప్రదాయ సంరక్షకులని, దేశ రక్షకులని అభివర్ణించారు. తరతరాలుగా ఈ అమర్నాథ్ యాత్ర ఆధ్యాత్మిక వారసత్వంగా కొనసాగుతోందన్నారని గుర్తు చేశారు. ఈ యాత్రకు మరోసారి భక్తులను స్వాగతించడానికి తాము సిద్ధమవుతున్నామని తెలిపారు. అలాంటి తరుణంలో మీ మార్గదర్శనం, సహకారం కోసం మీలో ప్రతి ఒక్కరి కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు. ప్రతి యాత్రికుడు గౌరవం, భద్రతతోపాటు తాము కూడా ఈ ప్రాంతానికి చెందిన వారమనే భావన పెంపొందేలా చూడటంలో మీ పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా వ్యాఖ్యానించారు.
యాత్రికులకు గుడ్ న్యూస్..
తమ హోటళ్లలో బస చేసే అమర్నాథ్ యాత్రికుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని హోటల్ యజమానులు ప్రకటించారు. వారు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
మరో నాలుగు రోజుల్లో యాత్ర ప్రారంభం..
జూన్ 3వ తేదీన ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 28వ తేదీతో ఈ యాత్ర ముగియనుంది. ఈ యాత్ర కోసం ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం పోలీసులు, సైన్యంతోపాటు 670 కంపెనీల పారా మిలిటరీ బలగాలను మోహరించనుంది.





