
28views
పంజాబ్ లో క్రైస్తవ మిషనరీల ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా నియోజకవర్గ పరిధిలోని 61 గ్రామాల్లో క్రైస్తవ సామాజిక భవనాల నిర్మాణానికి రూ. 15 కోట్ల నిధులను అక్కడి ఆప్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా క్రిస్టియన్ల ప్రార్థనా మందిరాలు, ప్రార్థనా సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, సామాజిక సమ్మేళనాల కోసం ఉపయోగపడే భవనాల నిర్మాణానికి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షలు మంజూరు చేశారు.
అజ్నాలా అనే ప్రాంతంలో ఈ మధ్య అక్కడి ఆప్ ప్రభుత్వం విరివిగా, అదే పనిలో క్రైస్తవులను, మిషనరీలను బుజ్జగించే పనిలో పడింది. కొన్ని రోజుల క్రిందటే శ్మశానవాటిక మౌలిక సదుపాయాల కోసం, ప్రహరీ గోడ నిర్మాణం, మరమ్మతు పనులు, మరియు శవాలను భద్రపరిచే ఫ్రీజర్ను ప్రభుత్వం అందించింది.
పంజాబ్ రాజకీయ చర్చల్లో క్రైస్తవులు మరియు మత మార్పిడికి సంబంధించిన అంశాలు అధికంగా ప్రస్తావనకు వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. అజ్నాలా మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో క్రైస్తవ జనాభా గణనీయంగా ఉండటంతో ఆప్ సర్కార్ ఇవన్నీ చేస్తోందని జాతీయవాదులు మండిపడుతున్నారు.క్రైస్తవ సంక్షేమ బోర్డులకు జిల్లా స్థాయి నియామకాలు, లక్షిత గ్రాంట్లు మరియు సమాజ-నిర్దిష్ట మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు క్రైస్తవ సమాజంలోని వివిధ వర్గాల మధ్య మద్దతును ఏకీకృతం చేసే ప్రయత్నంలో కూడా ఆప్ సర్కార్ వుంది.
మత మార్పిళ్లు కూడా వేగవంతం…
పంజాబ్ లో అక్రమ మత మార్పిళ్లు కూడా అంతే వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2025 నాటి ఓ మీడియా నివేదిక ప్రకారం రెండేళ్ల వ్యవధిలో 3.5 లక్షల మందికి పైగా మత మార్పిడికి గురయ్యారని తెలిపింది. అలాగే తార్న్ తరణ్ ప్రాంతంలో క్రైస్త జనాభా 102 శాతం పెరిగింది. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు, రోగాల నయం, సామాజికంగా సహాయం అంటూ క్రైస్తవ మిషనరీలు ఈ ప్రాంతంలో చెలరేగి పోతున్నాయి. అలాగే కెనడా, అమెరికా, బ్రిటన్ దేశాలకు కూడా సులభంగా పంపుతామంటూ ఆశ చూపిస్తున్నాయి. దీంతో పంజాబ్ యువత ఇందులో చిక్కుకుంటున్నారు.
మజ్హబీ సిక్కులు, దళితులు మరియు ఇతర అణగారిన వర్గాల పట్ల సామాజిక, రాజకీయ నిర్లక్ష్యం అనేది తరచుగా ప్రస్తావించబడే మరో అంశం. సిక్కు మతం సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, కుల ఆధారిత వివక్ష ఆందోళనకరంగానే ఉంది. ఇది మిషనరీ బృందాలకు గౌరవం, ఆమోదం మరియు సామాజిక మద్దతును అందించడం ద్వారా బలహీన వర్గాలను ఆకర్షించడానికి అవకాశాలను కల్పించింది.
ఈ నేపథ్యంలో, భగవంత్ మాన్ ప్రభుత్వం మత మార్పిడుల సమస్యలను పరిష్కరించడం కంటే క్రైస్తవ సమాజ మౌలిక సదుపాయాలకు ఎందుకు భారీ ఆర్థిక సహాయం అందిస్తోందనే ప్రశ్న తలెత్తుతోంది. సిక్కు సమాజంలో మత మార్పిడుల సమస్యలను పరిష్కరించడం కంటే, ఎన్నికల ప్రయోజనాల కోసం క్రైస్తవ సమూహాలను ప్రసన్నం చేసుకోవడంపైనే ఆప్ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని చాలామంది వాదిస్తున్నారు.




