News

అయోధ్య రాముడికి అరుదైన కానుక…

31views

అయోధ్యలో ఒక అరుదైన, భక్తిపూర్వక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరొందిన జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. ‘ఎగ్ ఆఫ్ ది సన్’ అని కూడా పిలిచే ఈ పండును స్థానిక రైతు ఒకరు తన తోటలో పండించి, తొలి ఫలాన్ని రాముడికి అర్పించడం విశేషం.

అయోధ్యకు చెందిన ఓంప్రకాశ్ సింగ్ అనే రైతు సుమారు రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా మియాజాకి మొక్కను నాటారు. అయోధ్య వాతావరణంలో ఈ రకం పెరుగుతుందో లేదోనని ఆయన చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఈ సీజన్‌లో ఆయన తోటలో సుమారు డజను పండ్లు కాశాయి. స్థానిక సంప్రదాయం ప్రకారం, సీజన్‌లో పండిన తొలి పండును విక్రయించడానికి లేదా తినడానికి ముందుగా తులసి దళంతో పాటు భగవంతుడికి సమర్పించారు.

అంతర్జాతీయ మార్కెట్లో మియాజాకి మామిడి పండ్ల ధర కిలోకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో పండు ధర సుమారు లక్ష రూపాయలు వరకు పలుకుతుంది. చూడటానికి రూబీ ఎరుపు రంగులో ఉండే ఈ పండు అద్భుతమైన తీపితో పాటు పీచు లేకుండా ఉండటం దీని ప్రత్యేకత.

దీనిపై మహంత్ సీతారాం దాస్ జీ మహారాజ్ స్పందిస్తూ, “పండ్లలో మామిడి రారాజు. దాని వర్ణం సూర్య భగవానుడిని పోలి ఉంటుంది. అయోధ్యలో ఈ తరహా ఫలం పండటం ఇదే తొలిసారి. ఇంతటి ఖరీదైన పండును మొట్టమొదటగా భగవంతుడికి సమర్పించడం సంతోషదాయకం” అని తెలిపారు. కాగా, ఓంప్రకాశ్ సింగ్ తోటలో థాయ్‌లాండ్‌కు చెందిన ‘బనానా మ్యాంగో’, ఆస్ట్రేలియాకు చెందిన ‘R2E2’ వంటి ఇతర విదేశీ రకాలు కూడా ఉన్నాయి.