News

యూపీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠా గుట్టు రట్టు

76views

భారతదేశంలో భయోత్పాతాన్ని సృష్టించేందుకు పాకిస్తాన్ హ్యాండ్లర్ల కనుసన్నల్లో పనిచేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠాను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ -ATS అధికారులు అరెస్ట్ చేశారు. రైల్వే సిగ్నల్ బాక్సులు, గ్యాస్ సిలిండర్ల లారీలు, కీలక ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్న ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మీరట్‌కు చెందిన సాకిబ్ అలియాస్ ‘డెవిల్’ అనే వ్యక్తి ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిని ఏప్రిల్ 2న లక్నోలో అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు

సాకిబ్ సోషల్ మీడియా వేదికలైన టెలిగ్రామ్, సిగ్నల్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. వీరి ఆదేశాల మేరకు దేశంలోని ప్రముఖ సంస్థలు, రాజకీయ నాయకుల కదలికలపై నిఘా ఉంచి, ఆ సమాచారాన్ని విదేశీ ముఠాలకు చేరవేస్తున్నాడు. సాకిబ్ తన అనుచరులైన వికాస్ గహ్లావత్, లోకేష్ అలియాస్ పాప్లా, అర్బాబ్లను సోషల్ మీడియా ద్వారానే ముఠాలో చేర్చుకున్నాడు. వీరిని రెచ్చగొట్టి మతపరమైన విద్వేషాలు సృష్టించేలా హ్యాండ్లర్లు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్..

ఈ ముఠా సభ్యులు గజియాబాద్, అలీఘర్, లక్నో వంటి నగరాల్లో చిన్నపాటి దహనకాండలు సృష్టించి, ఆ వీడియోలను పాకిస్థాన్ హ్యాండ్లర్లకు పంపేవారు. దీనికి ప్రతిఫలంగా వారు క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా డబ్బులు స్వీకరించే వారని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 2న లక్నో రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను పేల్చి వేసేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ వేసింది. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ బృందం, ఈ దారుణం జరగకముందే నిందితులను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 7 మొబైల్ ఫోన్లు, 24 రెచ్చగొట్టే కరపత్రాలు, ఆధార్ కార్డులు, మండే స్వభావం గల ద్రవాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.