News

‘యూనిఫాం సివిల్ కోడ్’ ఒక్కటే శాశ్వత పరిష్కారం : సుప్రీంకోర్టు

108views

ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతున్న 1937 నాటి షరియత్ చట్ట నిబంధనలను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి -UCC అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం, ఈ కేసులో మహిళలకు ఆస్తి వారసత్వంలో వివక్ష జరుగుతోందన్న వాదనతో ఏకీభవిస్తూనే, దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను శాసనసభకే వదిలివేయడం ఉత్తమమని పేర్కొంది.

విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. ఒకవేళ కోర్టు 1937 నాటి షరియత్ చట్టాన్ని కొట్టివేస్తే, ముస్లిం వారసత్వ హక్కులను పర్యవేక్షించడానికి మరో చట్టం అందుబాటులో లేదని, ఇది ఒక ‘చట్టపరమైన శూన్యతను’ సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సంస్కరణల పట్ల ఉన్న ఆతురతలో ముస్లిం మహిళలు ఇప్పుడు పొందుతున్న హక్కులను కూడా కోల్పోయే పరిస్థితి రాకూడదని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యలన్నింటికీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ ఒక్కటే శాశ్వత పరిష్కారమని, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం దీనిని రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదే పిటిషన్ విచారణ సందర్భంగా మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చీ మాట్లాడుతూ.. ‘ఒక పురుషుడికి ఒకే భార్య’ అనే నిబంధన ప్రస్తుతం అన్ని వర్గాలకు సమానంగా వర్తించడం లేదని, ఇటువంటి అసమానతలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, షరియత్ చట్టాన్ని కొట్టివేసి భారత వారసత్వ చట్టాన్ని వర్తింపజేయాలని కోరగా, కోర్టు దానిని సున్నితంగా తోసిపుచ్చింది. కోర్టులు గతంలో కూడా అనేకసార్లు యూసీసీని తీసుకురావాలని సిఫార్సు చేశాయని, ఈ విషయంలో పార్లమెంటు తన విజ్ఞతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది.