
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటని, మన రాజధాని పేరు మన ప్రాచీన సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఉండాలని ఎంపీ ఖండేల్వాల్ తెలుపుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు. చారిత్రక గ్రంథాలు, పురావస్తు ఆధారాల ప్రకారం ప్రస్తుత ఢిల్లీ ఒకప్పుడు పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థం అని చెప్పుకొచ్చారు.
మహాభారత కాలంలో ఇది వైభవోపేతమైన నగరంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ అనే పేరు మధ్యయుగ కాలంలో వాడుకలోకి వచ్చిందని, అది నగరపు అసలైన నాగరికతను ప్రతిబింబించదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. కేవలం పేరు మార్పుతోనే సరిపెట్టకుండా ఢిల్లీ ప్రాచీన వైభవాన్ని చాటిచెప్పేలా మరికొన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఖండేల్వాల్ కోరారు.
ఢిల్లీలోని చారిత్రక పురాణ ఖిల్లా వద్ద పాండవుల విగ్రహాలను ప్రతిష్టించాలని ఆయన సూచించారు. తద్వారా పర్యాటకులకు, వచ్చే తరాలకు మన ప్రాచీన వారసత్వం గురించి తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును “ఇంద్రప్రస్థ జంక్షన్”గా, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని “ఇంద్రప్రస్థ విమానాశ్రయం”గా మార్చాలని ఆయన సూచించారు.





