News

విశాఖకు మరో మణిహారం.. ‘త్రిశూల్‌’

43views

విశాఖపట్నం  పర్యాటక సిరి.. కైలాసగిరిపై మరో ఆకర్షణ సిద్ధమవుతోంది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్‌వే, స్కై సైక్లింగ్, జిప్‌లైనర్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు చేపట్టిన త్రిశూల్‌ ప్రాజెక్టు మరింత ఆసక్తి కలిగిస్తోంది. దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వాస్తవానికి వీఎంఆర్‌డీఏ శివరాత్రి నాటికి దీన్ని పూర్తి చేయాల్సినప్పటికీ పలు కారణాలతో ఆలస్యమైంది. ఉగాది నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తుపాన్లను తట్టుకునేలా..: తుపాను గాలులు, భూకంపాలను తట్టుకునేలా ఈ త్రిశూల్‌ ప్రాజెక్టు చేపడుతున్నారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌తో అధ్యయనం చేసి ఎంత ఎత్తులో నిర్మించాలో పరిశీలించారు. మొదట 55 అడుగుల్లో నిర్మించాలనుకున్నప్పటికీ తర్వాత 65 అడుగులకు పెంచారు. కింద నుంచి పైవరకు త్రిశూలం పొడవు 65 అడుగులైతే అందులో ఒక్క ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉండనుంది.

త్రిశూలమైతే 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో తయారు చేశారు. ఆయా ఆకృతులను పుణెలో రూపొందించారు. ఇవి ప్రస్తుతానికి విశాఖ చేరుకున్నాయి. సుదూరంలోని నగర ప్రజలకు కనిపించేలా త్రిశూలం లోపలి భాగంలో ఎల్‌ఈడీ దీపాలు అమర్చనున్నారు. అలాగే చుట్టూ 30 అడుగుల విస్తీర్ణంలో వేదిక నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ వేదిక నిర్మాణం ఆలోచన చేయలేదు. తర్వాత పర్యాటకులు సెల్ఫీలు తీసుకునేందుకు, కూర్చునేందుకు వీలుగా దాన్ని చేపడుతున్నారు.

ఉగాదికి పూర్తయ్యేలా..: సందర్శకుల కోసం కైలాసగిరిపై పలు ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి. అదనంగా భారీ త్రిశూలం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన చేశాం. పర్యాటకులు కాసేపు సేదతీరేలా ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఉగాది నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం.ప్రణవ్‌గోపాల్, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌