ArticlesNews

డాక్టర్ హెడ్గేవార్ ‘స్వరాజ్’ సంకల్పం

186views

భారత స్వాతంత్య్ర పోరాటం గురించి చర్చ వచ్చినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ (RSS) మరియు డాక్టర్ హెడ్గేవార్ గారు అందులో పాల్గొనలేదనే ప్రచారం జరుగుతుంటుంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ మరియు దాని కార్యకర్తలు బ్రిటిష్ పాలనకు పూర్తిగా వ్యతిరేకమని నిరూపించడానికి చరిత్రలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన.. నెహ్రూ గారు, కాంగ్రెస్ జెండా ఇంకా కిసాన్‌సింగ్ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడి మధ్య జరిగింది.

డిసెంబర్ 1936లో ఫైజ్‌పూర్‌లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలు జరుగుతున్నాయి. సభను ప్రారంభించడానికి 80 అడుగుల పొడవైన జెండా కర్రపై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తుండగా, ఆ జెండా మధ్యలోనే చిక్కుకుపోయింది. అప్పుడు ఆ మైదానమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అందరూ అయోమయంలో పడ్డారు. నాయకులు పైకి చూస్తున్నారు. వాలంటీర్లు చిక్కుకున్న జెండాను తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బ్రిటిష్ పాలనపై భారతీయుల తిరుగుబాటుకు చిహ్నంగా జరగాల్సిన ఆ సభ, అసలు మొదలవ్వకముందే ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది.

అప్పుడు, శిర్పూర్ గ్రామానికి చెందిన కిసాన్‌సింగ్ పరదేశి అనే ఒక యువ స్వయంసేవక్ ధైర్యంగా ముందుకు వచ్చాడు. అతడు ఏం చేస్తున్నాడో మిగతావారికి అర్థమయ్యేలోపే.. చకచకా ఆ పోల్ పైకి ఎక్కేశాడు. చిక్కుకుపోయిన జెండా వద్దకు చేరుకుని, వేలాది మంది చూస్తుండగానే దాన్ని ఆవిష్కరించాడు. అది చూసి జనం హర్షధ్వానాలతో ఊగిపోయారు. కాంగ్రెస్ నాయకులు అతడిని తమ భుజాలపైకి ఎత్తుకుని ప్రశంసలతో ముంచెత్తారు. అక్కడికక్కడే అతడిని ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, అక్కడున్నవారికి అసలు విషయం తెలిసింది. ఆ సాహసం చేసిన యువకుడు కిసాన్‌సింగ్, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ అని కాంగ్రెస్ నాయకులు తెలుసుకున్నారు. దీంతో ‘సాంకేతిక కారణాల’ (Procedural issues) సాకుతో అతడిని సన్మానించాలనే నిర్ణయాన్ని నిశ్శబ్దంగా పక్కన పెట్టేశారు. అయితే, ఆ తర్వాత జరిగిన సంఘటన.. ఏ రాజకీయ ప్రణాళిక (Manifesto) వివరించలేనంత గొప్పగా డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ గారి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పింది.

కిసాన్‌సింగ్‌కు గుర్తింపు నిరాకరించారనే వార్త హెడ్గేవార్ గారికి తెలిసినప్పుడు, ఆయన ధర్నాలు చేయలేదు లేదా ఎటువంటి ప్రకటనలు గుప్పించలేదు. ఆయన చాలా నిరాడంబరంగా 1937, మార్చి 23న ధూలేలో జరిగిన సంఘ్ శాఖకు కిసాన్‌సింగ్‌ను ఆహ్వానించారు. అక్కడ, డాక్టర్ హెడ్గేవార్ గారు కిసాన్‌సింగ్‌ను తన పక్కనే కూర్చోబెట్టుకుని, వెండితో చేసిన ఒక పాత్రను (Goblet) బహుమతిగా ఇచ్చి సన్మానించారు. సాధారణంగా బహిరంగ సన్మానాలకు దూరంగా ఉండే హెడ్గేవార్ గారు, ఇలా చేయడం ఒక అరుదైన గౌరవం. ఆ సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు, అది దశాబ్దాల పాటు సంఘ్ యొక్క రాజకీయ సిద్ధాంతానికి దిక్సూచిగా నిలిచింది: ‘దేశానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి ఒక స్వయంసేవక్ తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు—ఇదే అసలైన ధర్మం.’ ఈ మాట వినగానే అక్కడ ఉన్న 500 మందికి పైగా సభ్యులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు.

ఇది కేవలం ఏదో ఆవేశంలో అన్న మాటలు కాదు, ఇదొక సిద్ధాంతం. దేశం కోసం చేసే పనికి (National Work), ఒక పార్టీ పట్ల చూపే విధేయతకు (Party Loyalty) మధ్య ఉన్న స్పష్టమైన తేడాను డాక్టర్ హెడ్గేవార్ గారు ఇక్కడ నొక్కి చెప్పారు. బ్రిటిష్ పాలనకు (సామ్రాజ్యవాదానికి) వ్యతిరేకంగా పోరాడేటప్పుడు విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలని హెడ్గేవార్ గారు స్పష్టం చేశారు.

అయితే సంఘ్ పట్ల సానుభూతి ఉన్న కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కాకాసాహెబ్ తెంభే.. హెగ్డేవారు ఆలోచనతో కలత చెందారు. కాంగ్రెస్ వారు మిమ్మల్ని అవమానించారు కదా, అలాగే ఆ పార్టీ పనితీరును, వారి సిద్ధాంతపరమైన పోకడలను విమర్శించాలని కోరుతూ హెడ్గేవార్‌కు లేఖ రాశారు.

కానీ డాక్టర్ హెడ్గేవార్ గారు తెంభే అభిప్రాయంతో ఏకీభవించలేదు. స్వయంసేవకుల మనస్సుల్లో కాంగ్రెస్ పట్ల ఎటువంటి అసంతృప్తి గానీ, వ్యతిరేకత గానీ కలగడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన దృష్టిలో అప్పట్లో రెండే మార్గాలు ఉన్నాయి: ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్ తన శక్తిని ఎంతగా పెంచుకోవాలంటే.. ఒక గొప్ప విప్లవం ద్వారా బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టేంతగా బలోపేతం అవ్వాలి. ఒకవేళ అది సాధ్యం కానప్పుడు, కాంగ్రెస్ నాయకత్వంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగాలి. స్వాతంత్ర్య పోరాటంలో వర్గాలుగా విడిపోయి బహుళ కేంద్రాలను సృష్టించడం ఆయనకు ఇష్టం లేదు. ఎక్కడా చీలికలు వద్దు; ముఠా తగాదాలు లేకుండా మన మొదటి ప్రాధాన్యత కేవలం ‘స్వరాజ్యం మరియు భారత్’ మాత్రమే కావాలని ఆయన బలంగా నమ్మారు.

ఈ విశ్వాసం ఆయన ఏదో రాజకీయ లాభం కోసం తీసుకున్నది కాదు. ఇది హెడ్గేవార్ గారి విప్లవాత్మకమైన నేపథ్యం నుండి పుట్టుకొచ్చిన ఒక స్పష్టమైన వైఖరి. కానీ.. బ్రిటిష్ ప్రభుత్వం డాక్టర్ హెడ్గేవార్ ను ‘ప్రమాదకరమైన వ్యక్తి’గా తన రికార్డుల్లో నమోదు చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ఆవిర్భావానికి చాలా కాలం ముందే, బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆయన పేరు తెలుసు. 1909లోనే, తిరుగుబాటును ప్రేరేపించారని మరియు ఒక పోలీస్ అవుట్‌పోస్ట్ మీద బాంబు విసిరారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో, నాగ్‌పూర్‌లో ఆయనపై ‘రాజద్రోహం’ (Sedition) కేసు నమోదైంది.

ఆ సమయంలో బ్రిటిష్ కోర్టు గదిలోనే నిలబడి ఆయన బ్రిటిష్ పాలనను ‘మానవత్వం లేనిది, అనైతికమైనది, చట్టవిరుద్ధమైనది మరియు క్రూరమైనది’ అని ధైర్యంగా విమర్శించారు. కేవలం బ్రిటిష్ చట్టాలను మాత్రమే కాకుండా.. వారి పోలీస్ వ్యవస్థను, కోర్టులను మరియు మొత్తం యంత్రాంగాన్నే ఎదిరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆయన వాదనలు విన్న మేజిస్ట్రేట్ (న్యాయమూర్తి) కోపంతో.. ‘నీవు కోర్టులో చెబుతున్న ఈ సంజాయిషీ, నీవు బయట చేసిన ప్రసంగాల కంటే ఎక్కువ రాజద్రోహపూరితంగా ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని చాలా మంది భారతీయులకు ఆయన పేరు కూడా తెలియని 7 సంవత్సరాల ముందే, బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ‘అత్యంత ప్రమాదకరమైన రాజకీయ నేరస్థుడు’ (Probable dangerous political criminal) అని తమ రికార్డుల్లో వర్గీకరించింది.

1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం (Civil Disobedience Movement) సమయంలో, హెడ్గేవార్ గారు అడవి సత్యాగ్రహానికి (Forest Satyagraha) నాయకత్వం వహించి మళ్ళీ జైలుకు వెళ్ళారు. 9 నెలల కఠిన కారాగార శిక్ష కూడా ఆయన పట్టుదలను నీరుగార్చలేకపోయింది. 1940లో ఆయన అనారోగ్యానికి గురయ్యే సమయానికి, సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప విప్లవకారులు సైతం ఆయన వైపు ఆకర్షితులయ్యారు. నేతాజీ గారు, హెడ్గేవార్ మరణించడానికి సరిగ్గా ఒక రోజు ముందు కూడా ఆయనను కలిసి చర్చలు జరిపారు.

కిసాన్‌సింగ్ ఘటన అనేది కేవలం చరిత్రలో ఒక చిన్న సంఘటన కాదు, అది ఒక మార్గదర్శి (Blueprint). డాక్టర్ హెడ్గేవార్ తన స్వయంసేవకుడిని సముచితంగా గౌరవించారు, కానీ అదే సమయంలో.. ఆ అంశాన్ని ఉపయోగించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో చీలికలు తేవడానికి ఆయన ఇష్టపడలేదు