
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్ర ముప్పుఉందని ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పంజాబ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో నిషేధిత ఉగ్రసంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కి చెందిన టెర్రర్ మాడ్యూల్ను గుర్తించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున భయాందోళన సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్ తో తయారు చేసిన ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోసీవ్ డైవైస్-IED, రెండు గన్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్ర మాడ్యూల్ అమెరికా (America)లో ఉన్న BKI హ్యాండ్లర్లు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద హోషియార్పూర్లోని గర్శంకర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.





