
‘ప్రాచీన చరిత్రకు ఆలయాలు దర్పణాలు. వాటిని సంరక్షించి భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ఈనాటి, రేపటి తరంపై ఉంది’ అని త్రిదండి రామానుజ చినజీయర్ అనుగ్రహభాషణ చేశారు. మూలాపేటలోని రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవాన్ని చినజీయర్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాలాలయంలో తాత్కాలికంగా ప్రతిష్టించిన మూర్తులను ఆయన దర్శించుకున్నారు. అనంతరం తొలుత హోమశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఉప ఆలయాల పునఃనిరాణాలకు శిలాన్యాసం, పూజా కార్యక్రమాలను చేశారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం కనులపండువగా జరిగింది. అనంతరం చినజీయర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా అధికారి కోవూరు జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





