
ఆదివాసీల జీవనోపాధికి సమష్టిగా కృషిచేద్దామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏలోని ఆదితల్లి విగ్రహానికి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా తొలిపూజ చేశారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ అడవితల్లికి సారెను సమర్పించారు. గిరిజన సంఘాల నాయకులు, అధికారులతో కలిసి జలాభిషేకం, పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరిపారు. డప్పువాయిద్యాల సంప్రదాయ నృత్యాలు చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మనమంతా భూమాత బిడ్డలమనే భావన కలుగుతుందన్నారు. గిరిజనుల జీవనం ప్రకృతితో కొనసాగుతుందన్నారు. పీఓ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ గిరిజన పూజలు, నృత్యాలు, వారి కట్టు, బొట్టు అంతా చరిత్రను గుర్తుచేసేలా ఉంటుందన్నారు. కలెక్టర్, పీఓలు గిరిజనులతో కలిసి డప్పువాయిస్తూ నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఏపీఓ ఎ.మురళీధర్, డీడీ కృష్ణవేణి, డీఐఓ డాక్టర్ పి.జగన్మోహన్రావు, గిరిజన సంఘం నాయకులు పి.రంజిత్కుమార్, పి.సురేష్, ఎ.చంద్రశేఖర్, ఐ.రామకృష్ణ, బి.తమ్మయ్య, డి.సీతారాం, మంచాల పారమ్మ, కోలక గౌరమ్మ, బి.గౌరీశంకరరావు, ఆర్.లోవరాజు, ఎ.విప్లవకుమార్, జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





