
వారిద్దరూ ప్రేమించుకున్నారు. మతాలు వేరైనా పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత భర్తకు వేధింపులు మొదలయ్యాయి. మతం మారమంటూ భార్య.. భర్తను వేధించసాగింది. వేధింపులు భరించలేని భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్యపై కేసు పెట్టాడు. ఈ సంఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గదగ్ జిల్లాకు చెందిన విశాల్ కుమార్ గోకవి, తహసీన్ హొసమని మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరుకావటంతో విశాల్ ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు.
దీంతో 2024 నవంబర్ నెలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే అతడికి వేధింపులు మొదలయ్యాయి. ముస్లిం సాంప్రదాయం ప్రకారం రెండో సారి పెళ్లి చేసుకుందామని తహసీన్ అతడ్ని వేధించసాగింది. భార్య పోరు తట్టుకోలేక పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏప్రిల్ 25వ తేదీన ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. పెళ్లి సందర్భంగా అతడి పేరు కూడా మార్చారు. ఈ నేపథ్యంలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి జరగాలని విశాల్ కుటుంబసభ్యులు పట్టుబట్టారు.
ఇందుకు తహసీన్ కూడా ఒప్పుకుంది. జూన 5వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, తహసీన్ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తహసీన్ వెనక్కు తగ్గింది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుదరదని తేల్చి చెప్పింది. విశాల్ చెబుతున్న దాని ప్రకారం.. మతం మారమంటూ తహసీన్ బాగా ఒత్తిడి చేస్తోంది. మతం మారకపోతే రేప్ కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగుతోంది. రోజు రోజుకు తహసీన్, ఆమె కుటుంబం వేధింపులు పెరగటంతో విశాల్ పోలీసులను ఆశ్రయించాడు. భార్యపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





