
తిరుమలలోని అన్నమయ్య భవన్ కు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో జూలై 22వ తేదిన భక్తులకు అందుబాటులోకి రానున్న నూతన శ్రీవాణి కేంద్రాన్ని అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా టీ, కాఫీ, పాలు, తాగునీరు, పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. శ్రీవాణి టికెట్ల సమాచారాన్ని భక్తులందరికీ తెలిసేలా డిజిటల్ స్క్రీన్ల ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం ఏఎన్సీ, హెచ్వీసీ ఉప విచారణ కార్యాలయాల వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిరుమలలోని ఫుడ్&వాటర్ ల్యాబ్ ను తనిఖీ చేసి అక్కడ చేపడుతున్న పరీక్షల గురించి సిబ్బందితో ఆరా తీశారు. నాణ్యతలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు పగడ్భందీగా ఆహార, తాగునీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.





