News

చైనాతో ఫలించిన చర్చలు.. ఆరేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం..

248views

చైనాలోని కింగ్‌డావోలో భారత్-చైనా రక్షణ మంత్రుల మధ్య అనేక కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా కౌంటర్ అడ్మిరల్ డాంగ్ జున్‌తో భేటీ అయ్యారు. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు క్రియాశీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయం నుంచి ఆగిపోయిన మానస సరోవర్ యాత్ర గురించి భారత రక్షణ మంత్రి ప్రస్తావించారు. అనంతరం యాత్ర పునఃప్రారంభంపై చైనా సానుకూలంగా స్పందించింది. దీంతో చర్చ అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు.

కింగ్‌డావోలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అనుసరిస్తున్న సానూకూల విధానాలనే కొనసాగించాలని, కలిసి పనిచేస్తూ కొత్త సమస్యలు రాకుండా నివారించాలని ఇరుదేశాల తీర్మానించాయి. ఈ క్రమంలోనే ఆగిపోయిన కైలష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభంపై భారత్ చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీని పట్ల కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు.

భేటీ సందర్భంగా భారత రక్షణ మంత్రి చైనా రక్షణ మంత్రికి ‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే సంప్రదాయ మధుబని పెయింటింగ్‌ను బహుకరించారు. బీహార్‌లోని మిథిలా ప్రాంతానికి చెందిన ఈ సాంస్కృతిక కళ అత్యంత పురాతనమైనది. ఇదిలా ఉంటే, షాంఘై సహకార సంస్థ (SCO) సంయుక్త ప్రకటన చేసేందుకు భారత్ నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించకపోవడం, సీమాంతర ఉగ్రవాదంపై ఇండియా కఠినవైఖరిని పేర్కొనకపోవడమే ఇందుకు కారణం.