News

వెలుగులోకి వచ్చిన మూడు ‘లవ్ జిహాద్’ కేసులు

27views

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రేమ, వివాహం, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన నాలుగు వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలపై సంబంధిత రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అలీగఢ్‌లో యువతి ఫిర్యాదు.. నకిలీ పేరుతో మోసం చేశాడని ఆరోపణ
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఢిల్లీకి చెందిన ఓ హిందూ మహిళ, అన్సార్ అలీ అనే వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘రాహుల్’ అనే నకిలీ పేరుతో తనకు పరిచయమై ప్రేమ పేరుతో నమ్మించి, ఆలయంలో వివాహం చేసుకున్నాడని తెలిపింది. వివాహం అనంతరం అతని అసలు గుర్తింపు తెలిసిందని, తర్వాత ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం నికాహ్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆరోపించింది.

అంతేకాకుండా, తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చి హలాలా ఆచరించాలని డిమాండ్ చేశాడని, మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి బందీగా ఉంచడంతో పాటు లైంగికంగా వేధించి, అమ్మేందుకు కూడా ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హర్దోయ్‌లో యువతి అపహరణ కేసు
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో సల్మాన్ అనే వ్యక్తి వివాహం పేరుతో 19 ఏళ్ల హిందూ యువతిని అపహరించాడని ఆరోపణలు వచ్చాయి. యువతి కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా తుపాకీతో బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇండోర్‌లో బస్సులో యువతి.. పోలీసులకు అప్పగించిన ఇర్ఫాన్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రాజస్థాన్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్‌ను బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఓ బస్సులో గుర్తించి పోలీసులకు అప్పగించారు. బీహార్‌కు చెందిన హిందూ యువతిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కోటాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. యువతి కూడా తనను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించాడని తెలిపినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో మత మార్పిడి ఆరోపణ
ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ జిల్లా గంగోలిహట్‌లో వివేక్ సింగ్ అనే వ్యక్తి, ఢిల్లీకి చెందిన యాస్మిన్ అనే మహిళపై మత మార్పిడికి ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేశాడు. తనను మతం మారాలని ఒత్తిడి చేసి, నిరాకరించడంతో ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిందని, తన కుమారుడికి బలవంతంగా సున్నతి చేయించిందని ఆరోపించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా యాస్మిన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.