News

కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు

254views

ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నెల రోజులపాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు.

అమ్మవారికి సారె సమర్పించడం సంతోషంగా ఉంది..
ఈ సందర్బంగా ఈవో శీనానాయక్ మీడియాతో మాట్లాడారు. తమ చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించామన్నారు. ఆషాఢ మాసంలో నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సారే సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ నుంచి అమ్మవారికి ఈనెల 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని చెప్పుకొచ్చారు. ఈ మాసంలోనే అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు జరుగుతాయన్నారు. జులై 8 , 9, 10 తేదీల్లో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈరోజు నుంచి నెల రోజులపాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతాయని ఈవో శీనానాయక్ వెల్లడించారు.

నెల రోజులపాటు ఉత్సవాలు..
కాగా, ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచీ దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మూలవిరాట్‌ దర్శన అనంతరం ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తారు. కాగా, వైదిక కమిటీ సూచనల మేరకు హోమ గుండాలు, భక్తులు కూర్చునేందుకు తివాచీలు ఏర్పాటు తదితర అంశాలపై ఈవో శీనా నాయక్ ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశారు. వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి ప్రచారం చేసి విజయవంతం చేయాలని పలు విభాగాలకు ఆదేశాలిచ్చారు. వారాహి ఉత్సవాలు గురువారం (26వ తేదీ) నుంచి జులై 24వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.